

రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమం మరియు ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పేదలకు నిజమైన ఆపన్నహస్తంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
బుధవారం కోటబొమ్మాళిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, టెక్కలి నియోజకవర్గానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా రూ. 14 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉండి, వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఈ నిధి పునర్జన్మను ప్రసాదిస్తోంది,” అని అన్నారు. విద్య, వైద్యం రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు,కళింగ కోమటి చైర్మన్ బోయిన గోవిందరాజులు గారు,స్థానిక ముఖ్య నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
