కీర్తిరాయునిగూడెం (మైలవరం రూరల్):

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. శనివారం (31.01.2026) తెల్లవారుజాము నుంచే ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ గారు స్వయంగా లబ్ధిదారుల ఇల వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేశారు.
ఆదివారం సెలవైనా ఆగని పెన్షన్
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేపట్టింది. ఈ సందర్భంగా దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “ఆదివారం అని చూడకుండా, ఒకరోజు ముందుగానే అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్లవారుజాము నుంచే పెన్షన్ అందించడం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు, అవ్వాతాతలకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనం,” అని పేర్కొన్నారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారాలను నమ్మొద్దు
ఈ కార్యక్రమంలో ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. “అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందుతుంది. దీనిపై వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. కేవలం బురద చల్లడమే పనిగా పెట్టుకున్న ఫేక్ పార్టీల దుష్ప్రచారాలను లబ్ధిదారులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి,” అని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ వస్తోందని, ఈ వాస్తవాన్ని ప్రజలే విపక్షాలకు గట్టిగా చెప్పాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు పెన్షన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి ముంగిటకే పెన్షన్ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.
